Coronavirus | హైదరాబాద్/సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నిలోఫర్ దవాఖానలో 9 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్గా తేలింది. జలుబు, దగ్గు, జ్వరం సమస్యలతో దవాఖానలో చేరిన 17 మంది చిన్నారులకు పరీక్షలు నిర్వహించగా, చౌటుప్పల్కు చెందిన 9 నెలల చిన్నారికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. నిలోఫర్లో నమోదైన కేసుల సంఖ్య నాలుగు చేరింది. బుధవారం మంచిర్యాల జిల్లాలో ఒకరికి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్టలో ఓ విద్యార్థినికి కరోనా వచ్చింది.
జేఎన్-1 ప్రమాదకారి కాదు: మంత్రి దామోదర
దేశవ్యాప్తంగా ప్రబలుతున్న జేఎన్-1 కొవిడ్ వేరియంట్ అంత ప్రమాదకారి కాదని, గత వేరియంట్లలో ఇదొక భాగమని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి సీ దామోదర రాజనర్సింహ తెలిపారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో కొవిడ్ నియంత్రణపై సమీక్ష నిర్వహించారు.