మిగతా ఇబ్బందుల పరిష్కారానికే సదస్సుల నిర్వహణ
త్వరలోనే రెవెన్యూ సదస్సులు.. ప్రతి దరఖాస్తూ పరిష్కారం
బండిది మౌనదీక్ష కాదు.. తెలంగాణ ప్రగతిపై అసూయ దీక్ష
దీక్ష ఇక్కడ కాదు.. మోదీ ఇంటి ముందు కలిసి చేద్దాం
విలేకరుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దశాబ్దాలుగా రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ను తెచ్చారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 99 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. మిగిలిన సమస్యలను కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకొని పరిష్కరించేందుకు ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నదని చెప్పారు. ఈ విషయంలో అడ్డగోలుగా మాట్లాడుతున్న నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం కరీంనగర్లో చేసిన మౌన దీక్షపై మంత్రి గంగుల మండిపడ్డారు. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక చేసిన అసూయ దీక్ష అని విమర్శించారు.
స్థానిక మీసేవ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ గతంలో ప్రతి గ్రామంలోనూ 70-80% భూ పంచాయితీలుండేవని, వీటికోసం హత్యలు కూడా జరిగేవన్నారు. ఒక మ్యుటేషన్ కావాలంటే నెలల తరబడి తిరగాల్సి వచ్చేదన్నారు. ఇవేవీ లేకుండా ధరణి పోర్టల్ను తీసుకొస్తే అందులో వస్తున్న ఫలితాలను చూసి బండి సంజయ్ లాంటి వాళ్లు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. మంచి కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కనీసం ప్రయత్నం చేశారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి కాబట్టి.. రెవెన్యూ సమస్యలు లేకుండా చేయాలని చూస్తున్నారని, ఆ ప్రయత్నమే ధరణి అని పేర్కొన్నారు.
మోదీ ఇంటి ముందు దీక్ష చేద్దామా?
నిజానికి కుర్చీ వేసి దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదని, కేంద్రం నుంచి రావాల్సిన హక్కుల కోసం, నిధుల కోసం, చట్టసభలో బీసీల రిజర్వేషన్ల కోసం ప్రధాని మోదీ ఇంటి ముందు చేయాలని బండికి సూచించారు. ఆ దీక్షలో తాను కూడా పాల్గొంటానన్నారు. మోదీ ఆఫీసు ముందు కుర్చీ వేసుకొని అడుగాల్సిన ప్రశ్నలు అనేకం ఉన్నాయని, అందుకు బండి సిద్ధంగా ఉన్నారో లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో బీజేపీలో చేరికల కమిటీ అని వేశారని, నిజానికి ఏ పార్టీలో ఇలాంటి కమిటీలుండవని పేర్కొన్నారు. అందులోనూ చేరికల కమిటీకి అధ్యక్షుడిగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని నియమించడం ఆ పార్టీ నైజాన్ని బయట పెడుతుందన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. బండి సంజయ్ సొంత నియోజకవర్గానికి చేసింది ఏమిటో ఒక్క సారి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ బండి సంజయ్కు డ్రామా దీక్షలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని పేరొన్నారు. ఈ సమావేశంలో రాష్ట ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్, సూడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ,మేయర్ సునీల్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.