హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 173 ఇంజినీరింగ్ కాలేజీల్లో 98,296 సీట్లున్నట్టు అధికారులు తెలిపారు. కన్వీనర్ కోటాలో 70,307 సీట్లుండగా, మేనేజ్మెంట్ కోటాలో 27,989 సీట్లున్నాయని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం భర్తీచేసే ఇంజినీరింగ్ సీట్లను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవనసేన ఆదివారం మీడియాకు విడుదల చేశారు.
ఈ ఏడాది బీటెక్ సీట్లల్లో సగానికి పైగా సీట్లు సీఎస్ఈ, సీఎస్ఈ అనుబంధ బ్రాంచీల్లోనే ఉండటం గమనార్హం. కన్వీనర్ కోటాలోని మొత్తం సీట్లల్లో 41,968(59. 69%) సీఎస్ఈ, సీఎస్ఈ అనుబంధ బ్రాంచీల్లోనే ఉన్నాయి. సీఎస్ఈ కోర్సుల్లో సీట్లు గణనీయంగా పెరుగుతుండటంతో మిగతా బ్రాంచీల్లో సీట్లు తగ్గిపోతున్నాయి. యూనివర్సిటీలు, యూనివర్సిటీ కాన్స్టియంట్ కాలేజీలు 21 ఉండగా, వీటిల్లో 7,153 సీట్లు ఉండగా, కన్వీనర్ కోటాలో 6,603 సీట్లున్నాయి. ఇక 152 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 91,143 ఉండగా, కన్వీనర్ కోటాలో 63,704 సీట్లున్నాయి.
త్వరలోనే మరికొన్ని కోర్సులకు అనుమతులొచ్చే అవకాశాలున్నాయని, దీంతో సీట్ల సంఖ్య పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి కోర్ బ్రాంచిల్లో సీట్లను తగ్గించుకుని సీఎస్ఈలో సీట్లను పెంచుకోనున్నారు. ఇక, మొదటి విడత ఎప్సెట్ కౌన్సెలింగ్కు ఆదివారం వరకు 91,530 మంది హాజరయ్యారు. వీరిలో 25,041 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకున్నారు.
వెరిఫికేషన్ గడువు 13తో ముగుస్తుంది. వెబ్ ఆప్షన్లు సోమవారం నుంచి ప్రారంభంకానుండగా, 15 వరకు ఎంచుకోవచ్చు. 19లోపు మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఆదివారం సికింద్రాబాద్ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలోని హెల్ప్లైన్ సెంటర్ను తనిఖీ చేసి, కౌన్సెలింగ్కు హాజరైన విద్యార్థులతో సంభాషించారు.