హైదరాబాద్ సిటీబ్యూరో, కందుకూరు. నవంబర్ 24: (నమస్తే తెలంగాణ): ఎన్నికల తనిఖీల్లో భాగంగా శుక్రవారం 96 లక్షల నగదు పట్టుబడింది. హైదరాబాద్లోని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు కందుకూరు ఠాణా పరిధిలోని ఫార్మాసిటీ రోడ్డులో కారును తనిఖీ చేయగా, రూ.35 లక్షల నోట్ల కట్టలు దొరికాయి. వీటిని నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తికి తరలిస్తున్నట్టు తెలిసింది. స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టలను కందుకూరు పోలీసులకు అప్పగించారు. డబ్బులు తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇవి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి చెందినవిగా అనుమానిస్తున్నారు. హైదరాబాద్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం రూ.61,28,688 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ.62,84,99,310 నగదును సీజ్ చేసినట్టు ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ తెలిపారు. 841 ఎఫ్ఐఆర్లు, 4,120 నక్కాస్ ఆపరేషన్స్, కోడ్ ఉల్లంఘన కింద రెండు కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. వాహనాల దుర్వినియోగంపై నాలుగు కేసులు నమోదు చేసినట్టు వివరించారు.