హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ( TS ECET ) 2021లో అమ్మాయిలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. విద్యార్థినులు 95.93 శాతం ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 94.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈసెట్ -2021 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి కలిసి బుధవారం విడుదల చేశారు.
ఈసెట్ ఎగ్జామ్ను మొత్తం 23,667 మంది రాయగా, 22,522 మంది క్వాలిఫై అయ్యారు. మొత్తంగా 95.16 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈసెట్ కౌన్సెలింగ్ ఆగస్టు 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా తమ ప్రాథమిక వివరాలను నమోదు చేయాలని సూచించారు.
ఆగస్టు 24 నుంచి 28వ తేదీ మధ్యలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపారు. ఆగస్టు 26 నుంచి 29వ తేదీ మధ్యలో సరిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. అదే నెల 26 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్సు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 2వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 2 నుంచి 7వ తేదీ మధ్యలో సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టు చేసి, ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తదితర వివరాల కోసం https://tsecet.nic.in వెబ్సైట్ను సందర్శించొచ్చు.