హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ కాలేజీల్లో సీసీ కెమెరాల నిఘా సత్ఫలితాలనిచ్చింది. ఈ నెల 2న ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో కాపీయింగ్, విధుల్లో నిర్లక్ష్యంతో 83 మంది ఎగ్జామినర్లపై ఇంటర్బోర్డు వేటు వేసింది.
ఐదు పరీక్ష కేంద్రాలను రద్దు చేసింది. ఈ పరీక్షల కోసం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 5,500, గురుకులాల్లో 1,300, ప్రైవేట్ కాలేజీల్లో 7,500 కెమెరాలను ఏర్పాటు చేసి, హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించారు. ఈ పరీక్షలకు 3,11,011 జనరల్ కోర్సుల విద్యార్థులు, 90,254మంది వొకేషనల్ కోర్సుల్లోని విద్యార్థులు హాజరైనట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.