హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 86 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. శుక్రవారం బీఆర్కేభవన్లో అన్ని సంక్షేమశాఖల అధికారులతో గురుకుల పాఠశాలల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ 75 ఎస్సీ, 7 ఎస్టీ, 4 బీసీ గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీల కోసం శాశ్వత స్టడీ సర్కిల్స్ ఉండాలని సీఎం భావిస్తున్నారని, ఈ మేరకు కాన్సెప్ట్ నోట్ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నోట్ను తదుపరి సూచనల కోసం సీఎంకు అందజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అన్ని గురుకుల పాఠశాలల్లో పరిశుభత్ర కోసం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని, వంట సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బీ వెంకటేశం, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి నదీమ్ అహ్మద్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రొనాల్డ్ రోస్, బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్యభట్టు, మైనారిటీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి బీ షఫీ ఉల్లా పాల్గొన్నారు.