హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: ఓ ఇంట్లో నెల రోజులు నమ్మకంగా పనిచేసిన ఓ నేపాలీ జంట.. చివరికి ఆ ఇంటి యజమానులైన వృద్ధ దంపతులను తాళ్లతో కట్టేసి రూ.85 లక్షల సొత్తు దోపిడీ చేశారు. ఈ ఘటన సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. చింతల్బస్తీలో ఓంప్రకాశ్ అగర్వాల్ దంపతులు.. కొడుకు, కోడలు, మనవళ్లతో కలిసి నివసిస్తున్నారు. వస్త్ర వ్యాపారి ఓంప్రకాశ్ కుమారుడు మనోజ్ అగర్వాల్ దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. నేపాల్కు చెందిన బిపేశ్, అనిత శశి దంపతులు నెల కిందట ఓంప్రకాశ్ ఇంట్లో పనిమనుషులుగా చేరి నమ్మకంగా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత బిపేశ్ దంపతులు తమ బంధువులను పిలిపించారు. ఓంప్రకాశ్ దంపతులను నిద్రలేపి తాళ్లతో బంధించారు. బీరువాలో దాచిన రూ.5 లక్షల నగదుతోపాటు రూ.80 లక్షల విలువైన ఆభరణాలను దోపిడీచేసి పరారయ్యారు. మరో గదిలో నిద్రపోయిన కోడలు, మనమడు ఉదయం లేచేసరికి ఓంప్రకాశ్ దంపతులను తాళ్లతో కట్టేసి ఉండటంతో వెంటనే తాళ్లను విప్పేసి డయల్ 100కు ఫోన్ చేశారు. పనిమనుషులు, డ్రైవర్లను పనిలో చేర్చుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీపీ అంజనీకుమార్ స్పష్టంచేశారు. ఇందుకోసం పోలీసుల ‘హక్ ఐ’ మొబైల్ అప్లికేషన్ను ఉపయోగించుకోవాలని సూచించారు.