CM Revanth | హైదరాబాద్ : తెలంగాణ మూడో అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 82 మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. సీరియస్ క్రిమినల్ కేసులు 59 మంది ఎమ్మెల్యేలపై ఉన్నట్లు తెలిపింది. ఈ వివరాలను అభ్యర్థుల ఆఫిడవిట్ల ఆధారంగా వెల్లడించినట్లు పేర్కొంది. ఇక అత్యధికంగా సీఎం రేవంత్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై 89 కేసుల చొప్పున నమోదైనట్లు తెలిపింది. 2018 ఎన్నికల ఆఫిడవిట్లను పరిశీలిస్తే 73 మంది ఎమ్మెల్యేలపై మాత్రమే క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.
ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేపై మర్డర్ కేసు ఉండగా, ఏడుగురిపై హత్యాయత్నం కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఇద్దరు ఎమ్మెల్యేలపై మహిళలను వేధించిన కేసులు నమోదు అయ్యాయి. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేల్లో 52 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ నుంచి 20, బీజేపీ నుంచి ఏడుగురు, సీపీఐ నుంచి ఒకరు, ఎంఐఎం నుంచి నలుగురు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు వెల్లడించింది. సీరియస్ క్రిమినల్ కేసుల విషయానికి వస్తే.. కాంగ్రెస్ నుంచి 31 మంది, బీఆర్ఎస్ నుంచి 17 మంది, బీజేపీ నుంచి ఏడుగురు, సీపీఐ నుంచి ఒకరు, ఎంఐఎం నుంచి ముగ్గురు ఉన్నారు.