హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : బీటెక్ కన్వీనర్ కోటా సీట్లు ఖరారయ్యాయి. ఈ విద్యాసంవత్సరం ఈ కోటాలో 81,620 సీట్లు భర్తీచేయనున్నారు. 175 కాలేజీల్లో మొత్తంగా 1,14,007 సీట్లను సర్కార్ ఖరారు చేసింది. 30% సీట్లను యాజమాన్య కోటాలో భర్తీచేసుకునే అవకాశముండగా, 70% సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీచేస్తారు. ఎప్సెట్ మొదటి విడత కౌన్సెలింగ్ ఇప్పటికే ప్రారంభంకాగా, ఈ నెల 29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. వెబ్ ఆప్షన్ల నమోదు గురువారం నుంచి ప్రారంభంకానున్నది. విద్యార్థులు జూలై 1 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభంకానున్న నేపథ్యంలోనే ఈ విద్యాసంవత్సరం భర్తీచేసే సీట్ల వివరాలు అధికారులు ప్రకటించారు.
ఓయూ జేఎన్టీయూతో కలిపి 22 కాన్స్టియంట్ కాలేజీలున్నాయి. వీటిల్లో 6,046 సీట్లున్నాయి. మరో రెండు ప్రైవేట్ యూనివర్సిటీలున్నాయి. వీటిల్లో 1,800సీట్లుండగా, కన్వీనర్ కోటాలో 1,260 సీట్లు భర్తీచేయనున్నారు. ఇంజినీరింగ్ సీట్లల్లో 71% కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) బ్రాంచీలోనే ఉన్నాయి. కన్వీనర్ కోటాలో 81,768 సీట్లుంటే వీటిలో 58,038 సీట్లు ఒక్క సీఎస్ఈ, ఐటీ బ్రాంచీలోనే ఉన్నాయి. కోర్ బ్రాంచీలన్నింటిలోనూ 23,730 సీట్లు మాత్రమే ఉండటం గమనార్హం.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) జోరుతో ఐటీ ఉద్యోగాలు ఊడుతున్నాయి. ప్రముఖ కంపెనీలే లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి. మన దగ్గర సీఎస్ఈ జోరు సాగుతుండటం మంచిదికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) 18వేలకు పైగా కొత్త సీట్లకు అనుమతి ఇచ్చింది. దీంట్లో కన్వర్షన్ సీట్లు సైతమున్నాయి. ఈ కొత్త సీట్లకు జేఎన్టీయూహెచ్, ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. పాత సీట్లనే కౌన్సెలింగ్కు అనుమతించాయి.

