హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ‘దేశంలో ధనికులైన గొల్ల కురుమలు ఎక్కడ ఉన్నారంటే.. తెలంగాణలో ఉన్నారని చెప్పుకోవాలి. అందుకే గొర్రెల పంపిణీ పథకం అమలు చేస్తున్నాం’- ఇది గొర్రెల పంపిణీ పథకం, గొల్ల కురుమల బలోపేతంపై సీఎం కేసీఆర్ చెప్పిన మాట. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అక్షరసత్యమయ్యాయి. గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం అద్భుత ఫలితాలను సాధించింది. వారి జీవితాల్లో ఆర్థిక పరిపుష్టిని కల్పించింది. ఈ పథకం వల్ల ఐదేండ్లలో రూ.8 వేల కోట్ల సంపదను సృష్టించినట్టు అధికారుల అంచనా. పంపిణీ చేసిన గొర్రెలు, వాటికి పుట్టిన పిల్లల విక్రయంతో గొల్ల కురుమలకు ఇంత ఆదాయం సమకూరింది.
11 వేల కోట్లు.. 7.61 లక్షల మంది గొల్ల కురుమలు
గొల్ల కురుమలకు ఆర్థిక అండ కల్పించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా 2017 జూన్ 20న గజ్వేల్ నియోజకవర్గం కొండపాక గ్రామంలో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని 8,109 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల్లో 7,61,895 మంది సభ్యులు ఉన్నారు. సొసైటీల్లోని సభ్యులందరినీ అర్హులుగా పరిగణించిన ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 21 గొర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. తొలివిడతగా 3.93 లక్షల మందికి 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేసింది. ఇందుకోసం రూ.5,001 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటివరకు పంపిణీ చేసిన గొర్రెలకు సుమారు 1.32 కోట్ల పిల్లలు పుట్టినట్టు అధికారులు అంచనా వేశారు.
వలసలు బంద్.. మాంసం ఫుల్
ఉమ్మడి ఏపీలో ఉపాధి లభించక.. తెలంగాణ గొల్ల కురుమలు విదేశాలకు, ఇతర రాష్ర్టాలకు వలస పోయేవారు. కులవృత్తిని నమ్ముకొని గొర్రెలను పెంచుకుందామంటే జీవాలకు తాగడానికి నీళ్లు, తినడానికి మేత దొరకని పరిస్థితి. దీంతో పొట్టచేతపట్టుకొని వలస పోయేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ సంకల్పంతో సాగు నీళ్ల గోస తీరింది. ఎక్కడ చూసినా పచ్చని పంటలే. దీనికి తోడు గొల్ల కురుమలకు ఉపాధి కల్పించేలా సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేశారు. దీంతో వలస వెళ్లిన గొళ్ల కురుమలు సొంతూళ్లకు తిరిగొచ్చారు. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలతో సంతోషంగా జీవిస్తున్నారు. గతంలో రాష్ట్రంలో మాంసం కొరత ఉండేది. ఇతర రాష్ర్టాల నుంచి ప్రతిరోజూ 600-700 లారీల గొర్రెలు మన రాష్ర్టానికి వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. సమృద్ధిగా మాంసం లభిస్తున్నది. గొర్రెల పంపిణీతో రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి భారీగా పెరిగింది. 2015-16లో కేవలం 5.05 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి కాగా ప్రస్తుతం ఇది 10.85 లక్షల టన్నులకు పెరిగింది. దీంతో వినియోగదారులకు నాణ్యమైన మాంసం అందుబాటులోకి వచ్చింది.
సీఎం కేసీఆర్ ఆలోచన ఫలితంగానే..
సీఎం కేసీఆర్ ఆలోచనల ఫలితంగానే రాష్ట్రంలోని గొల్ల కురుమలు ఆర్థికంగా బలోపేతమయ్యారు. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం ద్వారా రూ.8 వేల కోట్ల సంపద సృష్టించడం గొప్ప విషయం. గొల్ల కురుమలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ చేపడుతాం.
-తలసాని శ్రీనివాస్యాదవ్, పశు సంవర్ధక శాఖ మంత్రి
గొల్ల కురుమల జీవితాల్లో మార్పు
గొర్రెల పంపిణీ పథకంతో గొల్ల కురుమల జీవితాల్లో సమూల మార్పులు వచ్చాయి. క్షేత్రస్థాయిలో నిర్వహించిన పలు సర్వేల్లోనూ ఇది స్పష్టమైంది. రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి భారీగా పెరిగింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభిస్తాం. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
-రాంచందర్, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్
ఈ నెలలో రెండో విడత పంపిణీ
రెండో విడత గొర్రెల పంపిణీ ఈ నెలలో ప్రారంభించనున్నారు. ఈ దఫా సుమారు 3.70 లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రూ.6 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. రెండో విడత పంపిణీ విధి విధానాలపై పశు సంవర్ధకశాఖ అధికారులు త్వరలో సీఎం కేసీఆర్కు నివేదిక అందజేయనున్నారు. సీఎం ఆమోదం తెలిపిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పంపిణీ ప్రారంభించనున్నారు. గొర్రెల ధరలు పెరిగిన నేపథ్యంలో లబ్ధిదారులపై భారం పడకుండా ప్రభుత్వం ఒక్కో యూనిట్ కొనుగోలుకు వెచ్చించే మొత్తాన్ని రూ.1.20 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచింది.