హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రోడ్లు, వంతెనల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.800 కోట్లు విడుదల చేయనున్నది. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఎఫ్ఐ) కింద ఈ నిధులను విడుదల చేసేందుకు అంగీకరించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడతాయని అధికారవర్గాలు తెలిపాయి.
రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల ఢిల్లీలో జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై తెలంగాణలో రోడ్లు, వంతెనల అభివృద్ధికి రూ.1,136.58 కోట్లు కేటాయించాలని కోరారు. ఇందులో జిల్లాలవారీగా 28 రోడ్ల అభివృద్ధికి రూ.801.28 కోట్లు, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో 8 వంతెనల నిర్మాణానికి మరో రూ.335.30 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు సమర్పించారు.