హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు డిసెంబర్ 8 నుంచి దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో నిర్వహించే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ)లను 25 పనిదినాల్లో పూర్తి చేయనున్నట్టు బోర్డు చైర్మన్ వీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 3వ తేదీ అర్ధరాత్రి వరకు www.tslprb.in వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు వ్యక్తిగత యూజర్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేసి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలని, ఈ ప్రక్రియలో అవాంతరాలు ఎదురైతే support@tslprb.inకు మెయిల్ ద్వారా లేదా 9393711110, 93910 05006 సంప్రదించాలని చెప్పారు.
11 కేంద్రాలు.. 2,37,862 మంది అభ్యర్థులు
పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్ కలిపి 17,291 పోస్టులకు టీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ జారీ చేయగా, 2,37,862 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పోలీస్ ఈవెంట్స్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాలను సిద్ధం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్లో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఒక అభ్యర్థి రెండు పోస్టులకు దరఖాస్తు చేసినా.. దేహదారుఢ్య పరీక్ష ఒకటే నిర్వహించనున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు.
వారం ముందే డిజిటల్ పరికరాలు
పోలీస్ నియమాక ప్రక్రియలో వీలైనంత వరకు సాంకేతికతను వినియోగిస్తున్నారు. బయోమెట్రిక్ మిషన్లు, ఎత్తు కొలిచే డిజిటల్ మీటర్లు, సీసీ కెమెరాలు సహా ఇతర సాంకేతిక సామగ్రిని డిసెంబర్ 1కల్లా అన్ని కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.