హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): సీనియర్ సిటిజన్స్కు తపాల శాఖ తీపికబురు అందించింది. పలు పథకాలపై వడ్డీ రేట్లను పెంచినట్టు పోస్టల్ అధికారులు తెలిపారు. అన్ని పథకాలపై 7 శాతానికి తగ్గకుండా వడ్డీ రేట్లు ఉండగా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) పథకానికి 8 శాతం వడ్డీ చెల్లించనున్నట్టు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఎంతోమంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం (పీఓఎంఐఎస్)
పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం (పీవోఎంఐఎస్) వడ్డీ రేటు 6.7 నుంచి 7.1 శాతానికి పెరిగింది. ఈ ఖాతాను కనీస డిపాజిట్ రూ.వెయ్యితో తెరవవచ్చు. గరిష్ట డిపాజిట్ జాయింట్ ఖాతా మొత్తం రూ.9 లక్షలు, ఒకే ఖాతా గరిష్ట నిల్వ రూ.4.5 లక్షలు. ఖాతా తెరిచిన నాటి నుంచి మెచ్యూరిటీ వచ్చే వరకు ప్రతి నెలాఖరులో వడ్డీ చెల్లిస్తారు.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా (పీవోటీడీ)
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా అనేది పోస్టల్ శాఖలోనే అత్యంత ప్రసిద్ధ పొదుపు పథకాలలో (పీవోటీడీ) ఒకటి. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ల కోసం నాలుగు వేర్వేరు టర్మ్ పాలసీలు 1 నుంచి 5 ఏండ్ల వరకు ఉన్నాయి. ఖాతా తెరవడానికి కనీసం రూ. వెయ్యి అవసరం. గరిష్ట డిపాజిట్ పేర్కొనలేదు. వడ్డీ రేటు 6.9 శాతం ఉండగా ఈ త్రైమాసిక పెరుగుదల తర్వాత ఖాతాదారులు 7 శాతం వడ్డీ రేటును పొందుతారు. 1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద సీనియర్ సిటిజన్ ఐదేండ్ల పథకంలో పన్ను మినహాయింపు పొందవచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ)
జనవరి-మార్చి త్రైమాసికానికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) వడ్డీ రేటు 6.8 నుంచి 7 శాతానికి పెరిగింది. కనీసం రూ.1000తో ఖాతాను తెరవాలి. గరిష్ట పరిమితి లేదు. డిపాజిట్ తేదీ నుంచి ఐదేండ్ల కాలపరిమితిలో మెచ్యూరిటీకి చేరుకుంటుంది. ఈ పథకంలో పెట్టుబడిదారుడు తమ పెట్టుబడికి సంబంధించిన బ్యాంకు ప్రతిజ్ఞను పొందడం ద్వారా లోన్ ఫైనాన్సింగ్ పొందవచ్చు.
ఆయా పథకాల్లో డిపాజిట్ చేసినవారు మెచ్యూరిటీకి ముందు ఖాతా మూసివేయాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే సాధ్యం అని అధికారులు పేర్కొన్నారు. ఖాతాదారుడు లేదా జాయింట్ ఖాతాలో ఎవరైనా లేదా ఖాతాదారులు మరణించినప్పుడు, ప్రత్యేక పరిస్థితుల్లో కోర్టు ఆదేశించినప్పుడు మాత్రమే వర్తిస్తుందని నిబంధనలు పేర్కొంటున్నాయి.
చిన్న మొత్తాల పొదుపు పథకాలు
పైన పేర్కొన్న పథకాలతోపాటు చిన్న మొత్తాల పొదుపు పథకాలైన కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) వడ్డీ రేటును 6.8 శాతం నుంచి 7 శాతానికి పెంచారు. ప్రస్తుత జనవరి-మార్చి త్రైమాసికానికి సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) 7.6 శాతం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) 7.1 శాతం పెరిగాయి.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)
సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) 2022-2023 ఆర్థిక సంవత్సరంలో జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి ప్రభుత్వం ఎస్సీఎస్ఎస్, పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం (పీవోఎంఐఎస్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) పథకాలపై వడ్డీరేట్లను పెంచిందని అధికారులు తెలిపారు. పెంపు తర్వాత సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) నాలుగో త్రైమాసికానికి సంవత్సరానికి 8 శాతం వడ్డీ రేటును కలిగి ఉంటుందని వివరించారు. 60 ఏండ్లు పైబడినవారు ఈ పథకానికి అర్హులుగా వెల్లడించారు. కనిష్టంగా రూ.వెయ్యితో ఖాతాను తెరిచే వీలుంది. గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టగలిగితే ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తుంది. ఐదేండ్ల మెచ్యూరిటీతో పాటు అదనంగా మూడేండ్లు పొడిగించుకొనే వీలుంది. రూ.1.5లక్షల వరకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపు ఉంటుంది. వడ్డీ ఆదాయం కూడా పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఖాతా తెరిచిన ఏడాది తర్వాత ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇందుకు 1.5 శాతానికి సమానమైన పెనాల్టీ మినహాయిస్తారు. రెండు లేదా ఆ తర్వాత సంవత్సరాలకు ఉపసంహరిస్తే 1 శాతానికి సమానమైన మొత్తాన్ని మినహాయించి చెల్లిస్తారు.