హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రహదారులకు రాజయోగం వచ్చింది. రాష్ట్రంలో మరో 8 జాతీయ రహదారుల పనులు తుదిదశకు చేరుకొన్నా యి. మరో రెండు నెలల్లో వీటిని అట్టహాసంగా ప్రారంభించేలా అధికారులు రోడ్డు నిర్మాణ పనులను చకచకా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలోని జాతీయ రహదారుల విభాగం ఈ ఎనిమిది నేషనల్ హైవేలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. రూ.2013 కోట్లతో 289 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ రహదారుల నిర్మాణ పను లు 80-90 శాతం పూర్తయినట్టు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరో రెండు నెలల్లో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు శరవేగంగా పనులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇందులో ప్రధానంగా ఆరాంఘర్-శంషాబాద్, హగ్గిరి-జడ్చర్ల, మల్లేపల్లి-హాలి యా, మహబూబ్నగర్-జడ్చర్ల, నకిరేకల్-నాగార్జునసాగర్, మిర్యాలగూడ-కోదాడ, భూపాలపల్లి-ఆత్మకూరు రోడ్లతోపాటు విజయవాడ -జగ్దల్పూర్ ఎన్హెచ్-221పై గోదావరి నది హైలెవెల్ వంతెన నిర్మాణ పనులు ఉన్నాయి.
స్వరాష్ట్రంలో జాతీయ రహదారులు రెట్టింపు
2006-2014 వరకు 1,005 కిలోమీటర్లు నేషనల్ హైవేలుగా నోటిఫై చేయగా, స్వరాష్ట్రం లో 2014-2022 వరకు 22 రోడ్లకు సంబంధించి 2,525 కిలోమీటర్లను జాతీయ రహదారులుగా ప్రకటించడం విశేషం. రాష్ట్రం ఏర్పడే నాటికి జాతీయ రహదారుల నిడివి 2,511 కిలోమీటర్లు కాగా, నేడు 4,983 కిలోమీటర్లకు పెరిగింది. అలాగే, రాష్ట్రానికి సంబంధించి 13 రాష్ట్ర రహదారులను 1,475 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. గత 8 ఏండ్లలో జాతీయ రహదారులకు సంబంధించి రూ.19,056 కోట్ల వ్యయంతో 81 పనులు మంజూరు చేశారు.
వీటి పొడవు 2,199 కిలోమీటర్లు. అలాగే, 1,223 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను డబుల్ లేన్లుగా అభివృద్ధి చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక జాతీయ రహదారులపై రూ.6,687 కోట్లు వెచ్చించారు. సెంట్రల్ రోడ్ ఫండ్ ద్వారా రూ.3,314 కోట్ల విలువగల 245 పనులు మంజూరు చేయగా, ఇందులో ఇప్పటివరకూ రూ.2,144 కోట్లు వ్యయం చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు 8 ఏండ్లలో రూ.251 కోట్లతో 14 ఆర్వోబీ/ఆర్యూబీలు పూర్తిచేయగా, 2014 నుంచి నేటి వరకు రూ.438 కోట్లతో 23 పనులను పూర్తి చేశారు.