హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఏ రాష్ట్రం ఇవ్వని రీతిలో పింఛన్లు, రూపాయి ఖర్చు లేకుండా లక్షల విలువ చేసే సహాయ ఉపకరణాలను అందజేస్తూ భరోసాగా నిలుస్తున్నది. ఆ దిశలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగుల కోసం ‘చేయూత’ పేరిట తొలివిడతగా 8 మొబైల్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఏరియా పరిధిలో 9 వాహనాలను, ఆపై జిల్లాకు ఒకటి చొప్పున 30 వాహనాలు మొత్తంగా 39 వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించింది.
సీఎస్సార్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద క్వాల్కమ్, నిర్మాణ్ సంస్థలు రూ.1.2 కోట్లతో 8 వాహనాలను అందజేశాయి. వీటిని వినియోగించుకొని హెల్ప్లైన్కు వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించనున్నారు. ఈ వాహనాలు అందుబాటులోకి వస్తే దివ్యాంగులు, వయోవృద్ధులు ఏ మారుమూల ప్రాంతం నుంచి సంప్రదించినా.. త్వరితగతిన వారి వద్దకు వెళ్లేందుకు, సేవలను అందించేందుకు అవకాశం ఏర్పడనున్నదని అధికారులు చెప్తున్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించని విధంగా తెలంగాణ సర్కారు కేవలం పింఛన్ల కోసమే రూ.1800 కోట్లను వెచ్చిస్తున్నదని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి తెలిపారు. హెల్ప్లైన్ సేవలను వినియోగించుకోవాలని దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ కోరారు.
ఆసరా పింఛన్ల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని దివ్యాంగులు, వయోవృద్ధులకు అండగా నిలిచింది. వారు ప్రశాంతంగా, సంతోషకరమైన జీవనాన్ని గడిపేందుకు చర్యలు చేపడుతున్నది. దివ్యాంగులు, వృద్ధుల భద్రత, సంక్షేమం, హకుల పరిరక్షణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది.