హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): గోల్కొండ కోటలో 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం 10:15 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఉదయం 10:05 గంటలకు గోల్కొండ కోట వద్దకు చేరుకొన్న సీఎం కేసీఆర్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలీసు కమాండెట్స్ ఘన స్వాగతం పలికారు.
కోట ముఖద్వారం నుంచి రాణీమహల్ వరకు సీఎం కేసీఆర్కు వివిధ సాంస్కృతిక కళా బృందాలు.. డప్పు వాయిద్యాలు, నృత్యాలు, బోనాలు, గిరిజన, ఆదివాసీ సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. జాతీయ గీతాలాపన అనంతరం పోలీస్లు, పోలీస్బ్యాండ్, మువ్వన్నెల జెండా అలంకరణలో ఉన్న విద్యార్థుల నుంచి సీఎం కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించారు. త్రివర్ణ పతాకాలతో గోల్కొండ ప్రాంతమంతా జాతీయ స్ఫూర్తిని చాటిచెప్పింది. జయ జయధ్వానాలతో కోట మార్మోగింది. తెలంగాణ కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకొన్నాయి.
అమర జవాన్లకు నివాళి
గోల్కొండ కోటకు రావడానికి ముందుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రగతిభవన్ నుంచి నేరుగా సింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్లో ఉన్న అమర జవాన్ల స్మారకస్థూపం వద్దకు చేరుకొని, అమర జవాన్ల స్మృతి చిహ్నం వద్ద పుష్పాంజలి సమర్పించారు. స్వాతంత్య్ర పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేరుగా గొల్కొండ కోటకు చేరుకొని స్వాత్రంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రగతిభవన్లో
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, నేతలు, సీఎంవో సిబ్బంది పాల్గొన్నారు.
వజ్రోత్సవ స్ఫూర్తి నవతరానికి దివిటీ: టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు
స్వతంత్ర భారత వజ్రోత్సవ స్ఫూర్తి నవతరానికి దివిటీగా దారి చూపుతుందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయ న జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని చెప్పిన గొప్ప దేశం మనదని, అహింసా విధానంతో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహానేత జాతిపిత మహాత్మాగాంధీ అని కొనియారు. ఎంతోమంది త్యాగ ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని వివరించారు.
స్వాతంత్య్రం నా జన్మహక్కు అని నినదించిన బాలగంగాధర తిలక్, ఆజాద్ హింద్ ఫౌజ్తో ఇండియన్ ఆర్మీని ఏర్పాటు చేసి పోరాడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్.. హైదరాబాద్ బిడ్డ సరోజీనినాయుడు.. ఇలా వేల మంది స్వేచ్ఛ కోసం పోరాటాలు చేశారని గుర్తుచేశారు. స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను ధారపోసిన త్యాగధనులకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు బండి రమేశ్, రూప్సింగ్, నాయినేని రాజేశ్వర్రావు, అలీబాక్రీ, ఆజం అలీ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ భవన్ ప్రాంగణంలోని తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాలవేశారు. భవన్లోని ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.