హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): యూనిఫాం ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) వర్గాలు వెల్లడించాయి. పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, రవాణా, అగ్నిమాపక శాఖల్లోని మొత్తం17,516 పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేయగా గడువు ముగిసే సమయానికి 12.70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలిపాయి. అంటే ఒక్కొక్క పోస్టుకు సగటున 72 దరఖాస్తులు వచ్చినట్టయ్యింది. మొత్తం 7.20 లక్షల మంది అభ్యర్థులు ఈ దరఖాస్తులను సమర్పించారు. పలువురు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేశారు. దరఖాస్తుదారుల్లో 25 శాతం మంది మహిళలు ఉంటారని అంచనా. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి రోజుకు సగటున 49 వేల మంది చొప్పున దరఖాస్తు చేసుకొన్నట్టు బోర్డు అధికారులు చెప్తున్నారు. ఈ పోస్టుల భర్తీకి తుది గడువు గురువారం రాత్రి 10 గంటలతో ముగిసింది.
ఆగస్టు మొదటి వారంలో ఎస్సై ప్రిలిమ్స్
యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసినందున ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణపై టీఎస్ఎల్పీఆర్బీ అధికారులు దృష్టి సారించారు. ఆగస్టు మొదటి వారంలో ఎస్సై ప్రిలిమ్స్, మూడో వారంలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. కానిస్టేబుల్ పోస్టుల్లో బ్యాక్లాగ్కు తావులేకుండా ముందుగా ఎస్సై ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు అధికారులు తెలిపారు. జైళ్లు, అగ్నిమాపకశాఖల్లోని పోస్టుల భర్తీకి తేదీల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎక్సైజ్, రవాణాశాఖల పోస్టుల భర్తీ ప్రక్రియను తొలిసారిగా టీఎస్ఎల్పీఆర్బీకి అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు.