హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): బీటెక్లోనే కాకుండా డిప్లొమాలోనూ కంప్యూటర్ సైన్స్ కోర్సు హవా కొనసాగుతున్నది. ఈ కోర్సులో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 4,228 సీట్లు ఉంటే అన్ని హాట్కేకుల్లా నిండిపోయాయి. పాలిసెట్ తుది విడత సీట్లను ఆదివారం కేటాయించారు. మొత్తం 72.51 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రెండు విడతల కౌన్సెలింగ్ ముగిశాక 118 కాలేజీల్లో 28,562 సీట్లుంటే, 20,709 సీట్లు భర్తీ అయినట్టు అధికారులు ప్రకటించారు. 7,853 సీట్లు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులంతా ఈ నెల 10లోపు ఫీజు చెల్లించి కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. 8 నుంచి 16 వరకు విద్యార్థులకు ఓరియంటేషన్ నిర్వహించి, 17 నుంచి ఫస్టియర్ క్లాసులను ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.