Singareni | హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులకు మూడు రోజుల ముందే దసరా పండుగ వచ్చేసింది. సింగరేణి సంస్థకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల నుంచి సీఎం కేసీఆర్ 32 శాతం బోనస్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సీ రూ. 711.18 కోట్ల మొత్తాన్ని లాభాల బోనస్గా కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి గురువారం సింగరేణి సంస్థ జమ చేసింది. సింగరేణిలో 42 వేల మంది కార్మికులున్నారు. వీరు 2022-23 లో ఎన్ని రోజులు డ్యూటీకి హాజరయ్యారనే దానిని ప్రాతిపదికగా తీసుకుని ఈ లాభాల బోనస్ను పంచారు. ఈ లెక్కన అత్యధికంగా రూ. 2.86 లక్షల మొత్తం రాగా.. కనిష్ఠంగా రూ. 53 వేలు వచ్చాయని సమాచారం.
సగటున ఒక్కో కార్మికుడికి రూ. 1.68 లక్షల చొప్పున లాభాల వాటా వచ్చింది. ఇలా మొత్తం 42 వేల మంది కార్మికులకు లాభాల వాటాను వారి వారి బ్యాంకు ఖాతాల్లోకి సింగరేణి యాజమాన్యం జమ చేసింది. ఇదిలా ఉండగా.. శనివారం ఫెస్టివల్ అడ్వాన్స్కూడా చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం రంగం సిద్ధం చేసింది. ఒక్కో కార్మికుడికి ఫెస్టివల్ అడ్వాన్స్ కింద రూ. 25 వేల చొప్పున అందజేస్తారు. దీనిని ఎలాంటి వడ్డీ లేకుండా 10 వాయిదాల్లో వారి జీతాల్లోంచి మినహాయించుకొంటారు. ఇప్పటికే రూ.1,450 కోట్ల మొత్తాన్ని వేతన బకాయిల కింద సింగరేణి చెల్లించింది. ఇప్పుడు లాభాల్లో వాటాను ఇచ్చింది. దీపావళి బోనస్కూడా ఆ పండుగకు ముందే చెల్లించేలా సంస్థ ఏర్పాట్లు చేసింది.