హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): గత ఎనిమిదేండ్లలో కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేసిందని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. కిడ్నీ బాధితులకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందించడమే కాకుండా నెలకు రూ.2,016 పెన్షన్ అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఈ నెల నుంచి సుమారు 5 వేల మందికి పెన్షన్ల పంపిణీ మొదలైందని అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని వెంగళ్రావునగర్లో ఉన్న ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్’కార్యాలయంలో డయాలసిస్ బాధితులకు పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల మంది కిడ్నీ బాధితులు ఉంటే.. వారిలో 10 వేల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని వివరించారు. అర్హులైనవారు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం మూడు ఉచిత డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, స్వరాష్ట్రంలో 103కు పెంచామని వివరించారు. ప్రస్తుతం 83 చోట్ల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
కిడ్నీ మార్పిడి అవసరమైనవారికి ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల విలువైన వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. జీవితకాలం ఉచితంగా మందులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఏటా 150 వరకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గాంధీ దవాఖానలో రూ.40 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. లవణాలు అధికంగా ఉన్న భూగర్భ జలాలు తాగితే కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని, దీనిని మిషన్ భగీరథతో నివారిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో కుటుంబ, సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతామహంతి, డీఎంఈ రమేశ్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
కిడ్నీ బాధితులకు రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న సేవలు
ప్రతి ఒక్కరికీ ఉచితంగా డయాలసిస్ సేవలు
103 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
దేశంలోనే తొలిసారి సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ల వాడకం
రవాణా భారం పడకుండా ఉచిత బస్పాస్లు
ఆర్థికంగా అండగా ఉండేందుకు రూ.2,016 పెన్షన్
ఉచితంగా కిడ్నీ మార్పిడి చికిత్సలు
జీవితాంతం ఉచితంగా మందులు
నా కుటుంబానికి పెన్షనే ఆధారం
నేను గతంలో చిట్ఫండ్ కంపెనీలో పనిచేశా. ఈ ఏడాది మార్చిలో కిడ్నీ సమస్య మొదలైంది. దీంతో ఉద్యోగం చేయడం కష్టమైంది. ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా డయాలసిస్ చేస్తున్నారు. బస్పాస్ ఇచ్చారు. ఈ నెల నుంచి రూ.2,016 పెన్షన్ ఇస్తున్నారు. కిడ్నీ సమస్యతో ఆర్థికంగా చితికిపోయిన నా కుటుంబానికి అండగా ఉండలేకపోతున్నానని బాధపడేవాణ్ణి. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ నా కుటుంబానికి అండగా నిలుస్తున్నది.
– పిన్నిక శ్రీనివాస్, నల్లకుంట