హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్తగా మంజూరైన 7 మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీలను ప్రారంభించుకోవడానికి సమకూర్చుకోవాల్సిన మౌలిక వసతులు, కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యల గురించి కేబినెట్ చర్చించింది.
రాష్ట్రంలో, భవిష్యత్తులో అనుమతించబోయే మెడికల్ కాలేజీల కొరకు స్థలాన్వేషణ, తదితర సౌకర్యాల రూపకల్పనకు సంబంధించి ముందస్తు చర్యలను ఇప్పటి నుంచే ప్రారంభించాలని వైద్యాధికారులను మంత్రివర్గం ఆదేశించింది. అవసరమున్న జిల్లాల్లో వచ్చే ఏడాదికి మెడికల్ కాలేజీల ఏర్పాట్ల కోసం చర్యలు ప్రారంభించాలని అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది.