హైదరాబాద్, జనవరి 5(నమస్తే తెలంగాణ)/ బండ్లగూడ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు ఏడు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ బస్సు డిపోలో నిర్వహించిన వన భోజన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. త్వరలోనే ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగానూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ కృష్ణకాంత్, ఆర్ఎం వరప్రసాద్, డిప్యూటీ ఆర్ఎంలు విజయభాను, జగన్, ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనాథ్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.