హైదరాబాద్ : నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా విజృంభిస్తోంది. మొత్తం 69 మంది మెడికల్ స్టూడెంట్స్తో పాటు పలువురు వైద్యులు కరోనా బారిన పడ్డారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్ మాట్లాడుతూ.. గత మూడు రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందన్నారు. కరోనా సోకిన వారిలో 20 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 10 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 35 మంది హౌస్ సర్జన్లు కరోనా బారిన పడినట్లు తెలిపారు. పలువురు సిబ్బందికి కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని, వారంతా హోం ఐసోలేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఉస్మానియా ఆస్పత్రిలో మొత్తం 400 మంది హౌస్ సర్జన్లు ఉండగా, ఎల్లప్పుడూ 200 మంది హౌస్ సర్జన్లు అందుబాటులో ఉండనున్నారు. 80 మంది పీజీ స్టూడెంట్స్ కూడా ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు 2,500 మంది రోగులకు వైద్యం అందిస్తామన్నారు. గాంధీ ఆస్పత్రిలో కేవలం కొవిడ్ రోగులకు వైద్యం అందిస్తున్న నేపథ్యంలో ఎమర్జెనీ కేసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలివస్తున్నాయని పేర్కొన్నారు.