ఎండను సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు పట్టభద్రులు పోటెత్తారు. ఉదయం 8 గంటల నుంచే భారీ సంఖ్యలో కేంద్రాలకు తరలివచ్చి ఓటు ప్రాధాన్యతను తెలిపారు. బ్యాలెట్ పేపర్ భారీ సైజులో ఉండటంతో ఓటు వేయడానికి ఒక్కో ఓటరుకు 5- 10 నిమిషాల సమయం పట్టింది. అయినప్పటికీ పట్టభద్రులు సహనం కోల్పోలేదు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా క్యూలో నిల్చుని ఓటేసి కానీ వెనుదిరగలేదు. పురుషులతోపాటు మహిళా పట్టభద్రులూ పెద్దఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. దీంతో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో రికార్డు పోలింగ్ నమోదయింది. గతంతో పోల్చితే గణనీయంగా ఓటింగ్ పెరిగింది.
హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పట్టభద్రులు భారీగా కదిలిరావడంతో అంచనాలకు మించి రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాలతో పోటీగా పట్టణ పట్టభద్ర ఓటర్లు కదిలివచ్చారు. పలు కేంద్రాల వద్ద ఉదయం నుంచే రద్దీకనిపించింది. కొన్నిచోట్ల పోలింగ్ మందకొడిగా ప్రారంభమైనా.. మధ్యాహ్నానికి పుంజుకున్నది. వరంగల్- ఖమ్మం- నల్లగొండ, హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ నియోజకవర్గాల పరిధిలోని 1,530 పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. వరంగల్- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 76.35%, మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గంలో 72.45% పోలింగ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. ఈ రెండు స్థానాలకు 2015లో జరిగిన ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ గణనీయంగా పెరిగింది. మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ స్థానంలో గత ఎన్నికల్లో 37.72%, వరంగల్- ఖమ్మం- నల్లగొండలో 54.62% మాత్రమే పోలింగ్ జరిగింది. ఓటుహక్కు వినియోగంపై అటు ఎన్నికల సంఘం, ఇటు ప్రభుత్వం విస్తృతంగా అవగాహన కల్పించడం, అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేయడంతో భారీ పోలింగ్ నమోదైనట్టు భావిస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు మంత్రులు, ఆయా జిల్లాల పరిధిలోని పలువురు అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని పార్టీల ముఖ్య నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ముందుగా మందకొడిగా సాగింది. ఉదయం 10 గంటల సమయానికి వరంగల్- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 8.11%, మహబూబ్నగర్- హైదరాబాద్- రంగారెడ్డి స్థానంలో 8.06% పోలింగ్ నమోదైంది. దీంతో అటు రాజకీయపార్టీలు, ఇటు అధికారులలో కొద్దిగా ఆందోళన కనిపించింది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ ఒక్కసారిగా పుంజుకున్నది. మధ్యాహ్నం 12 గంటలకు రెండుస్థానాల్లో 21% నమోదైన పోలింగ్.. 2 గంటలకు 40% దాటింది. పోలింగ్ ముగిసే సాయంత్రం 4 గంటల సమయానికి వరంగల్- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 64.7%, హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ స్థానంలో 59.96% నమోదైంది. మొదటి రెండుగంటల్లో సగటున గంటకు 4% పోలింగ్ నమోదుకాగా.. తర్వాత రెట్టింపు స్థాయిలో 10% చొప్పున పెరిగింది. పోలింగ్ ముగిసే సమయానికి కూడా కేంద్రాల్లో పట్టభద్రులు భారీగా క్యూలలో నిల్చున్నారు. వారందరికీ ఓటువేసే అవకాశం కల్పించడంతో 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
పట్టణ ప్రాంత విద్యావంతులకు పోటీగా గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు సైతం భారీగా తరలివచ్చారు. అంతేకాదు.. గ్రామీణ జిల్లాల్లో పట్టణ ప్రాంతాలకు మించి రికార్డుస్థాయిలో పోలింగ్ నమోదైంది. వరంగల్- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గం పరిధిలోని జనగామలో 83.37%, వరంగల్ రూరల్లో 77.78%, మహబూబాబాద్లో 78%, ములుగులో 79.38%, భద్రాద్రి కొత్తగూడెంలో 73%, జయశంకర్ భూపాలపల్లిలో 69% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తున్నది. మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గంలోనూ ఇదేస్ఫూర్తి కనిపించింది. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రికార్డుస్థాయిలో 78.5% పోలింగ్ నమోదైంది. జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో ఏకంగా 80% దాటింది. నారాయణపేటలో 79.3%, నాగర్కర్నూల్లో 76.21%, మహబూబ్నగర్లో 75.67% పోలింగ్ జరిగిందని సమాచారం. ఒకట్రెండు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 15 వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటుచేశారు. 7,560 మంది సిబ్బంది పాల్గొన్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకున్నారు.
రెండు నియోజకవర్గాల పరిధిలోనూ ఓటర్లు గంటలపాటు ఓపికగా క్యూలో నిల్చున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటంతో న్యూస్ పేపర్ పరిమాణంలో బ్యాలెట్ పేపర్లను ముద్రించిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రాధాన్యత ప్రకారం తమకు నచ్చిన అభ్యర్థులను వెతుక్కొని ఓటేసేందుకు ఒక్కో ఓటరుకు సగటున 5-10 నిమిషాలు పట్టింది. దీంతో ఓటర్లు పోలింగ్ కేంద్రం ఆవరణలో గంటలపాటు క్యూలో ఉండాల్సి వచ్చింది. అయినా సహనం కోల్పోకుండా ఓపికతో ఎదురుచూసి, ఓటేసి తమ బాధ్యతను నిర్వర్తించారు. ఓటు ప్రాధాన్యాన్ని మరోసారి చాటిచెప్పి ఆదర్శంగా నిలిచారు.