జనగామ : జఫర్గఢ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉప్పుగల్ గ్రామం వద్ద శుక్రవారం ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గ్రామ శివారులో డంప్ చేసిన 64 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ బియ్యం విలువ రూ. 1.66 లక్షల ఉంటుందని తెలిపారు. బియ్యాన్ని నిల్వ ఉంచిన కడమంచి ఉప్పలయ్యను పోలీసులు అరెస్టు చేశారు. పీడీఎస్ బియ్యాన్ని చుట్టుపక్కల గ్రామాల నుంచి కొనుగోలు చేసినట్లు ఉప్పలయ్య పోలీసుల విచారణలో అంగీకరించాడు. అధిక ధరకు మహారాష్ట్రలో ఈ బియ్యాన్ని విక్రయించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపాడు. అనంతరం నిందితుడిని జఫర్గఢ్ పోలీసులకు అప్పగించారు.