హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదిన్నరేండ్లలో టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల కింద రూ.6,237.28 కోట్ల రాయితీలు అందించింది. తద్వారా 85,728 మందికి లబ్ధి చేకూర్చింది. వీరిలో 70 శాతానికిపైగా (61,258 మంది) ఎస్టీ, ఎస్టీ, వికలాంగులే ఉండడం విశేషం. స్వరాష్ట్రంలో పరిశ్రమలకు సులభంగా అనుమతులిచ్చేందుకు తొలి ఏడాదే టీఎస్ ఐ-పాస్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. పారిశ్రామికవేత్తలకు విరివిగా ప్రోత్సాహకాలు అందించేందుకు వేర్వేరు పథకాలను తీసుకొచ్చింది. జనరల్ క్యాటగిరీ వారి కోసం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్ (టీ-ఐడియా), ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కోసం తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్సెంటివ్ స్కీం (టీ-ప్రైడ్)ను ప్రవేశపెట్టింది. ఈ పథకాల ద్వారా పెట్టుబడి రాయితీలు, స్టాంప్ డ్యూటీ, పవర్ కాస్ట్, వడ్డీ రీయింబర్స్మెంట్ ఇవ్వడంతోపాటు పారిశ్రామికవాడల్లో ప్లాట్ల కేటాయింపులో ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం.. టీ-ప్రైడ్ కింద 2014-15 నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.2,759.3 కోట్ల రాయితీలు అందజేసింది. మరో 7,596 మందికి రూ.354.64 కోట్ల రాయితీలను మంజూరు చేసింది.
టీ-ఐడియా కింద 2014-15 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 24,470 మంది లబ్ధిదారులకు రూ.3,477.98 కోట్ల రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం.. మరో 2,127 మందికి రూ.395.45 కోట్లు మంజూరు చేసింది. ఈ రెండు పథకాల కింద ఎక్కువగా ఆహారశుద్ధి, ఇంజినీరింగ్, చిన్నచిన్న ఉత్పత్తుల తయారీకి సంబంధించిన ఎంఎస్ఎంఈలు ఏర్పాటవుతున్నాయి. వీటి ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తున్నది.