ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్: రాష్ట్రంలో కరోనా బాధితులకు వైద్య సేవలందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న 47 వేల పడకలలో సగానికి పైగా కొవిడ్ చికిత్స వాడుతున్నామని వెల్లడించారు. ప్రైవేట్ దవాఖానలు, మెడికల్ కళాశాలల్లో మరో 14 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే వీటిని పూర్తిగా ఉపయోగించుకుంటామని ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రమవుతున్న క్రమం లో గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి, నేచర్ క్యూర్ దవాఖానలను సందర్శించి వైద్యసేవల పరిస్థితిపై సమీక్షించారు. సిబ్బంది కొరత ఏమైనా ఉందా? ఔషధాలు అందుబాటులో ఉన్నాయా? అనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్ సేవలను అందించడంలో ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. బాధితుల పరిస్థితి తీవ్రంగా మారిన తర్వాత గాంధీ దవాఖానకు తరలించి చేతులు దులుపుకోవాలనుకోవడం సరికాదని హితవుచెప్పారు. వైరస్ వ్యాప్తి తీవ్రం గా ఉన్నదని, నిర్లక్ష్యం తగదని, కరోనా కట్టడికి ప్రజలు బాధ్యతతో మెలిగి యంత్రాంగానికి సహకరించాలని కోరారు. రెండోదశ వైరస్ చాలా వేగంగా విస్తరిస్తున్నదని, తొలిదశలో 20% మంది దవాఖానల్లో చేరితే రెండోదశలో 95% మంది ఇంట్లోనే చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ప్రైవేట్ దవాఖానలు సీరియస్ కేసులు వస్తే గాంధీకి పంపిస్తున్నాయ ని, ఆ సమయంలో ఎవరూ ధర్నాలు చేయరాదని, వై ద్యులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తించాలి
వైరస్ లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తించి వేగంగా పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఈటల ఆదేశించారు. గ్రామస్థాయిలో ఆశావర్కర్లు, ప్రాథమి ఆరోగ్య కేంద్రాల వైద్యులు బాధ్యతతో వ్యహరించి కీలక పాత్ర పోషించాలని కోరారు. వైరస్ సోకినవారు ఎక్కువ మంది హోం ఐసొలేషన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పాలని పేర్కొన్నారు. హోం ఐసొలేషన్లో ఉన్నవారికి కిట్లను వెంటనే అందజేయాలని ఆదేశించారు. కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించే విషయంలో గ్రామ పంచాయతీ, స్థానిక మున్సిపల్ అధికారులు సమన్వయంచేసుకోవాలని సూచించారు.