యాదాద్రి, నవంబర్14: ‘చాలీ చాలని జీతం.. కడుపు మాడ్చుకుని పని.. స్వామివారికి మొక్కులు, తలనీలాలు సమర్పించుకునే భక్తులు ఇచ్చే దక్షిణతో కాలం వెల్లదీత.. ఏదో ఒకరోజు మా జీవితాలు మారి మాకు కడుపునిండా జీతం రాబోదా.. దేవుడి వద్దే సేవ చేస్తున్న మాకు ఏ నాయకుడో కనికరించడా’ ఇది ఒక్కప్పుడు కల్యాణకట్టలో పనిచేసే నాయీ బ్రాహ్మణుల దుస్థితి. కానీ, తాజాగా సీఎం కేసీఆర్ ఇచ్చిన జీవో వారి బతుకుల్లో వెలుగులు నింపింది. స్వామివారి కల్యాణకట్టలో వచ్చే ఆదాయంలో 60 శాతం వాటా నాయీ బ్రాహ్మణులకే అని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు గత సెప్టెంబర్ 2న దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కల్యాణకట్టలో పనిచేసే నాయీబ్రాహ్మణుల కండ్లల్లో ఆనందం వెల్లివిరిసినది. తరతరాలుగా కల్యాణకట్టలో పనిచేసే 48 మంది క్షౌరవృత్తిదారులకు లబ్ధి చేకూరనున్నది. పెరిగిన పారితోషికం నేడో, రేపో నాయీ బ్రాహ్మణుల ఖాతాల్లో జమ కానున్నది.
కల్యాణకట్ట ఆదాయంలో 60 శాతం వాటా
ప్రధాన ఆలయాలల్లో పని చేసే నాయీ బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కండుపునిండా పారితోషికం ప్రకటించారు. చాలీచాలని రెమ్యునరేషన్తో కడుపును చంపుకున్న క్షౌరవృత్తిదారులకు కల్యాణకట్టలో వచ్చే ఆదాయంలో 60 శాతం వాటా ప్రకటిస్తూ గొప్ప ఊరటను కల్పించారు. నేడో, రేపో నాయీ బ్రాహ్మణులకు మొదటి పారితోషికం అందనున్నది. హైదరాబాద్, వరంగల్ దేవాదాయ, ధర్మాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ పరిధిలోని దేవాలయాల కల్యాణకట్ట టిక్కెట్ రూ.20 నుంచి రూ.50కి పెంచగా, యాదగిరిగుట్టలో కూడా కల్యాణకట్ట ధర రూ.50కి పెరిగింది.
నాయీబ్రాహ్మణుల కండ్లల్లో ఆనందం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాయీ బ్రాహ్మణులు నిరాదరణకు గురయ్యారు. ఏదో ఒకరోజు మాకు మంచిరోజులు వస్తాయని భావించిన నాయీ బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందజేశారు. కల్యాణకట్ట ఆదాయంలో నాయీ బ్రాహ్మణులకు 60 శాతం వాటా ఇవ్వాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖను ఆదేశించారు. కల్యాణకట్ట టికెట్ రూ.20 ఉన్న ఆలయాల్లో రూ.50, రూ.10 ఉన్న ఆలయాల్లో రూ.35 వరకు పెంచారు. అందులో 60 శాతం అనగా రూ.50 టికెట్కు రూ.30, రూ.35 టికెట్కు రూ.21 వారికే ఇవ్వాలని సూచించారు. గతంలో కేవలం నెలకు రూ.6 వేలే పారితోషికం వచ్చేదని, తాజాగా పెంచిన వాటాతో రూ.50 టిక్కెట్ ఉన్న దేవాలయాల్లో ఒక్కొక్కరికి రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు, రూ.35 టికెట్ ఉన్న ఆలయాల్లో రూ.8వేల నుంచి రూ.10 వేల పారితోషికం అందనున్నదని నాయీ బ్రాహ్మణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కడుపునిండా రెమ్యునరేషన్
ఒక్కప్పుడు చాలీచాలని పారితోషికంతో ఇబ్బంది పడేవాళ్లం. యాదగిరిగుట్ట కల్యాణకట్టలో పనిచేసే మాకు నెలకు కేవలం రూ.6 వేలు మాత్రమే వచ్చేవి. అవి నిత్యావసరాలు, ఖర్చులు, పిల్లల చదువుకు సరిపోయేది కాదు. ఎన్నోసార్లు అప్పటి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాం. అయినా ఫలితం లేకుండాపోయింది. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ను కలిసి మా బాధలు విన్నవించుకున్నాం. సీఎం కేసీఆర్ మా కడుపునిండా రెమ్యునరేషన్ ప్రకటించటం సంతోషం.
-రాచకొండ జానకీరాం, అధ్యక్షుడు, రాష్ట్ర దేవాలయాల కల్యాణకట్ట సంఘం జేఏసీ, యాదగిరిగుట్ట
కేసీఆర్కు రుణపడి ఉంటాం
యాదగిరిగుట్ట కల్యాణకట్టలో 30 ఏండ్లుగా పని చేస్తున్నా. అప్పట్లో టిక్కెట్ మీద రెండు పైసలు మాత్రమే వచ్చేది. చంద్రబాబునాయుడి ప్రభుత్వంలో టిక్కెట్ రెమ్యునరేషన్ పద్ధతి తీసుకొచ్చి టిక్కెట్ ధర రూ.20 చేసి అందులో రూ.10 మాకు ఇచ్చేవారు. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటించిన 60 శాతం వాటాతో మాకు నెలకు రూ.18 వేల నుంచి రూ.20 వేల పారితోషికం అందనున్నది. మేమంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-రాచకొండ సుందర్, నాయీబ్రాహ్మణుడు,కల్యాణకట్ట, యాదాద్రి దేవస్థానం