Allu Arjun | హైదరాబాద్ డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: శాసనసభలో సీఎం రేవంత్రెడ్డి అల్లు అర్జున్పై విమర్శలు చేయడం, తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం జరుగుతున్నదని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంటిపై 10మంది యువకులు దాడి చేశారు. ఓయూ జేఏసీ నేతలుగా చెప్పుకుంటూ గేట్లను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. అడ్డుకున్న సిబ్బందిని చితకబాదారు. ఆవరణలోని పూలకుండీలను ధ్వంసం చేశారు. అల్లు అర్జున్ ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. అల్లు అర్జున్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చి యువకులను అరెస్ట్ చేశారు. అల్లు అరవింద్ మేనేజర్ కాంతారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన యువకులను చౌటుప్పల్కు చెందిన నాగరాజ్, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నగేశ్, కొడంగల్ నియోజకవర్గానికి చెందిన రెడ్డి శ్రీనివాస్ , మోహన్, చర్లపల్లికి చెందిన ప్రేమ్కుమార్ , షాద్నగర్కు చెందిన ప్రకాశ్గా పోలీసులు తెలిపారు. దాడి నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు, సమీపంలో పికెట్ ఏర్పాటు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై అల్లు అర్జున్ సిబ్బంది దాడి చేశారని యువకులు చెప్పారు.
ఓయూ జేఏసీ నేతలు కాదు: పోలీసులు
దాడికి పాల్పడిన వారు ఓయూ జేఏసీ పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు. కానీ వాళ్లు ఓయూ జేఏసీ నేతలు కాదని పోలీసులు స్పష్టంచేశారు. దాడిలో కీలకపాత్ర పోషించిన రెడ్డి శ్రీనివాస్ కొడంగల్ నియోజకవర్గానికి చెందిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గుర్తించారు. 2019లో కాంగ్రెస్ నుంచి జడ్పీటీసీగా కూడా పోటీ చేశాడని, అతడు సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తుంటాడని తెలుస్తున్నది. మిగిలిన యువకులు కూడా కాంగ్రెస్లో క్రియాశీలకంగా పని చేస్తున్నారని సమాచారం. మరోవైపు దాడిలో పాల్గొన్న రెడ్డి శ్రీనివాస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మళ్లీ 1500మందితో వచ్చి దాడి చేస్తామని ఆ వీడియోలో హెచ్చరించాడు.
ఇళ్లపై దాడిని సహించం: సీఎం రేవంత్రెడ్డి
సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని సహించబోమని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తూ సీఎంవో నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా డీజీపీ, నగర సీపీని ఆదేశించారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అర్జున్ పిల్లలను తీసుకెళ్లిన తాత
అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన ఆయన మామ ప్రభాకర్రెడ్డి మనుమడు అయాన్ మనుమరాలు అర్హను వెంట తీసుకెళ్లారు. దాడి ఉద్రిక్తతల నేపథ్యంలోనే వారిని తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రీల్స్ కట్ అవుతాయి ; ఏసీపీ విష్ణుమూర్తి
ఖైరతాబాద్, డిసెంబర్ 22: పోలీసులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వారి రీల్స్ కటవుతాయని సస్పెన్షన్లో ఉన్న ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ ముద్దాయి ప్రెస్మీట్ ఎలా పెడుతారు? పోలీసులను తీవ్ర పదజాలంతో ఇబ్బందులు పెడితే ఎక్కడికక్కడ కట్ చేస్తాం’అని హెచ్చరించారు. ఏసీపీ విష్ణుమూర్తి వ్యాఖ్యలపై సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఓ ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్లో టాస్క్ఫోర్స్ డీసీపీగా పనిచేసిన విష్ణుమూర్తి సస్పెన్షన్కు గురికాగా, ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్టు పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయం నుంచి విచారణ జరిపిస్తున్నారని, విష్ణుమూర్తిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ పేర్కొన్నారు.
సంయమనం పాటించాలి
జరుగుతున్న ఘటనలను ప్రజలంతా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో అభిమానులు సంయమనం పాటించాలి. మేం కూడా సంయమనం పాటిస్తున్నాం. దాడి గురించి తెలిసిన వెంటనే పోలీసులు వచ్చి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాడి చేసిన వారిపై కేసులు పెట్టారు. ఇంటి దగ్గర ఎవరు గొడవ చేసినా తీసుకువెళ్లేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
– అల్లు అరవింద్, అల్లు అర్జున్ తండ్రి