హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): మ్యాట్రిమొనీ సైట్ నుంచి కుదిరిన పెండ్లి సంబంధం ఒక వ్యక్తిని రూ.6.5 కోట్లు ముంచేసింది. బాధితుడు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. పోలీసు కథనం ప్రకారం.. బర్కత్పురాలో నివాసముండే రవికుమార్ తాగరం పెండ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తుండగా క్రిష్టియన్ మ్యాట్రిమొనీ నుంచి రీనా గోర్లె అనే ఒక మహిళ పరిచయమై పెండ్లి చేసుకోవడానికి ముందుకొచ్చింది. రవికుమార్కు తల్లిదండ్రులు లేకపోవడంతో రిటైర్డు సైంటిస్ట్ సీపన పద్మజారావు సోదరిగా ఉంటూ మ్యారేజీకి సంబంధించిన విషయాలు మాట్లాడింది.
కొన్ని కారణాలతో రీనా గోర్లెతో పెండ్లి వద్దని ఆమె రవికుమార్కు చెప్పారు. కానీ రీనా గోర్లె రవికుమార్కు ఫోన్లు చేస్తూ వెంటపడింది. రవికుమార్ను ఒప్పించింది. ఇద్దరి మధ్య కొన్నాళ్లు ఫోన్కాల్స్ నడిచాయి. పెండ్లికి ముందే రీనా తన తండ్రి జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం కోసమంటూ రూ.2 లక్షలు, అలాగే తన సోదరుడికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని కోరడంతో రవికుమార్ ఆ డబ్బు ఇచ్చాడు. ఖర్చులకని పలుమార్లు డబ్బు తీసుకుంది. ఈ క్రమంలోనే సర్వోమ్యాక్స్ లిమిటెడ్ సంస్థ సీఈవో సుధీర్ బొబ్బ తన బాస్ అని, అతనికి ఆర్థికసాయం చేయాలని కోరింది.
దీంతో రవికుమార్ తన కుటుంబ సభ్యుల సహకారంతో మూడు నాలుగు నెలల సమయంలో రూ.6.5 కోట్లు అతనికి చెల్లించాడు. 2022 ఫిబ్రవరి 12న రవికుమార్కు, రీనాకు పెండ్లి జరిగింది. పెండ్లి తరువాత రీనా దూరంగా ఉంటూ వచ్చింది. మార్చి 8న ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని రవిని హెచ్చరించింది. కంగుతిన్న రవికుమార్ అసలు ఏం జరిగిందని ఆరా తీస్తే సుధీర్తో రీనా వేరే ఫ్లాట్లో కలిసి ఉంటున్నట్టు తెలిసింది. వీరిద్దరితోపాటు కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి తనను మోసం చేశారని గుర్తించాడు.
డబ్బు వాపసు చేయాలని అడిగితే చంపుతామంటూ వారు బెదిరింపులకు దిగడంతో బాధితుడి తరపున సీపన పద్మజారావు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రీనా, సుధీర్లతో పాటు సర్వోమ్యాక్స్ లిమిటెడ్, వన్మాజ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రఘు, ప్రసాద్, వెంకట్ దొమ్మేటి, సాజిత్ వీకే, అనిల్ పారుపూడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.