జమ్మికుంట : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల విద్యాసంస్థల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం విడుదల చేశారు. ఈ విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం జులై 18వ తేదీన ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం విదితమే. ఈ ప్రవేశ పరీక్షకు 74,075 మంది విద్యార్థులు హాజరు కాగా, 46,491 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ గురుకుల విద్యాసంస్థలు దేశానికే దిక్సూచిగా మారాయన్నారు. అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను ఉచితంగానే అందిస్తున్నామని తెలిపారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులకు 50 శాతానికి పైగా స్థానికంగానే సీట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ మంచి నిర్ణయాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నామన్నారు. సీట్లు పొందిన బాలబాలికలకు మంత్రి ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు.