Karnataka | హైదరాబాద్, నవంబర్ 10 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఒకవైపు కరువు, మరోవైపు కరెంటు కోతలు, ఇంకోవైపు నీటికష్టాలు వెరసి కర్ణాటక రాష్ట్రమంతా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అయితే, గడ్డుపరిస్థితులకు పరిష్కారాన్ని చూపించి బాధ్యతగా వ్యవహరించాల్సిన అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాజకీయాలపై దృష్టిసారించింది. మాయమాటలతో ఇక్కడి ఓటర్లను మభ్యపెట్టి, అన్నిరంగాల్లో అభివృద్ధిపథాన దూసుకెళ్తున్న తెలంగాణను ఆగమాగంజేయడానికి కుట్రలు రచిస్తున్నది. ఇందులో భాగంగానే తెలంగాణలో ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం కర్ణాటకకు చెందిన పది మంది మంత్రులు, 48 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే తెలంగాణలో దిగబడ్డారు.
ఒకవైపు కర్ణాటకలో సంక్షోభం కొనసాగుతుంటే, తెలంగాణ ఎన్నికల ప్రచారానికి కన్నడ కాంగ్రెస్ సర్కారు ప్రజాప్రతినిధులను పంపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై డిప్యూటీ సీఎం, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ను మీడియా ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలను తెలంగాణ ఎన్నికల మేనేజ్మెంట్కు పంపించినట్టు ఒప్పుకొన్నారు. అయితే, సంఖ్యను తక్కువగా చేసి చూపించారు. పైగా గత బీజేపీ కూడా ఇలాగే చేసింది కదా అంటూ తమ చర్యలను సమర్థించుకొన్నారు. ‘మరేం ఎక్కువ మందిని పంపించలేదు. ఓ ఐదారుగురు మంత్రులు, మరో 40 మంది ఎమ్మెల్యేలనే పంపించాం. అయినా, గతంలో బీజేపీ కూడా ఇలాగే పంపించలేదా?’ అంటూ మీడియానే ఎదురుప్రశ్నించారు.
తెలంగాణ ఎన్నికల పరిశీలకులుగా కర్ణాటక కాంగ్రెస్ పంపించిన మంత్రులు, ఎమ్మెల్యేలందరూ అత్యంత సంపన్నులు కావడం గమనార్హం. తెలంగాణలో ఏఐసీసీ క్లస్టర్ ఇంచార్జులుగా నియమించిన వారిలో వైద్యారోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండురావు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్, స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్, ఆహార, పౌర సరఫరాల శాఖమంత్రి కేహెచ్ మునియప్ప, రెవెన్యూ శాఖమంత్రి కృష్ణ బైరె గౌడ, బీసీ-కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ ఎస్ తంగడయి, మైనార్టీ, గృహనిర్మాణ శాఖమంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్, అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే, యువజన సర్వీసులు, క్రీడా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బీ నాగేంద్ర ఉన్నారు. బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వంటి అత్యంత సంపన్నులను అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులుగా కాంగ్రెస్ నియమించింది. దీంతో ప్రలోభాలపర్వం పెద్దయెత్తున జరుగబోతున్నదన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఐదు గ్యారెంటీల పేరిట మాయమాటలు చెప్పి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు నెలలు గడిచినప్పటికీ, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది. రైతులకు సరిపడినంత విద్యుత్తు సరఫరా చేస్తామన్న కాంగ్రెస్.. 5 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోతున్నది. దీంతోపాటు అభివృద్ధి మాటను ఎప్పుడో మరిచిన ఆ పార్టీ సీనియర్లు సీఎం కుర్చీ కోసం తన్నులాటలకు దిగుతున్నారు. గత బీజేపీహయాంలో 40 శాతం కమీషన్ రాజ్ ఉంటే, ప్రస్తుత కాంగ్రెస్హయాంలో 50 శాతం అవినీతి జరుగుతున్నదన్న ఆరోపణలు అదనం.
ఇలా.. కర్ణాటకను కేవలం ఆరంటే ఆరు నెలల్లోనే భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణను కూడా ఆగంజేసేందుకు కుట్రలకు తెరతీసింది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో పంపిణీ కోసం కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు రాష్ట్రంలోకి చేరాయనే ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక కాంగ్రెస్కు చెందిన ఇద్దరు కీలక నేతల సన్నిహితుల ఇండ్లలో రూ.80 కోట్ల నోట్ల కట్టలను అక్కడి ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక, హైదరాబాద్ కంపెనీలను బెంగళూరుకు తరలించేందుకు డీకే.. పలువురు పారిశ్రామికవేత్తలకు లేఖ రాసినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలాంటి కుట్రలకు తెగబడుతున్న కాంగ్రెస్కు ఓటేస్తే, కర్ణాటకలాగే తెలంగాణ కూడా ఆగమవ్వడం ఖాయమని తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.