హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి రంగారెడ్డి చేవెళ్ల మండలం గుండాల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. బడిబాటలో భాగంగా ఈ నెల 10 వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ను చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, విద్యాశాఖ అధికారులు ఇంటింటికీ తిరిగి పిల్లల వివరాలను సేకరిస్తూ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా 5,407 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా, అత్యధికంగా ఇంగ్లిష్ మీడియంలోనే చేరినట్టు అధికారులు వెల్లడించారు. ఒకటో తరగతిలో అత్యధికంగా 4,114 మంది ప్రవేశాలు పొందారు. వీరిలో 748 మంది ప్రైవేట్ స్కూళ్లను వీడి సర్కారు బడుల్లో చేరడం విశేషం. జోగులాంబ గద్వాల జిల్లాలో 415, సంగారెడ్డిలో 344, వికారాబాద్లో 257, రంగారెడ్డిలో 256 మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో అడ్మిషన్లు తీసుకొన్నారు. ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది ఎస్సెస్సీ జవాబు పత్రాల మూల్యాంకనం విధుల్లో ఉండటంతో మిగిలిన టీచర్లు ఇంటింటి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఊ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని హ్యాబిటేషన్ పరిధిలో యాక్షన్ప్లాన్ రూపొందించి రంగంలోకి దిగారు.