హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): కృష్ణా బేసిన్లో వరద కొనసాగుతున్నది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకోగా, గేట్లను ఎత్తి దిగువకు వరదను విడుదల చేస్తున్నారు.
జూరాలకు 48 వేల క్యూసెక్కులు వస్తుండగా, దిగువకు 46 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులోకి మొత్తంగా 54 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వమట్టం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 120 టీఎంసీలకు చేరుకున్నది. ఇక మరోవైపు గోదావరి పూర్తిగా వరద తగ్గుముఖం పట్టగా, ప్రాణహితలో లక్ష క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది.