హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో సేవలు అందించిన అంగన్వాడీ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేసింది. ఇందుకు సంబంధిత రూ.1,67,78,500 చెక్కును రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ గురువారం ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యాదేవరాజన్కు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 33,557 మంది అంగన్వాడీ వర్కర్లు టేక్హోం రేషన్ అందివ్వడం, పోషణ్ ట్రాకర్లో లబ్ధిదారుల డాటాను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం వంటి సేవలు నిరంతరాయంగా నిర్వహించినందుకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందించింది. అంతకుముందు మంత్రి డైరెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమశాఖ చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రభుత్వశాఖల్లో ఖాళీల వివరాలను ఐదురోజుల్లో నివేదించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో.. స్త్రీ, శిశు సంక్షేమశాఖలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల వివరాలపై ఆరా తీశారు.