హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులతోపా టు ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకాలు తలెత్తకుం డా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నది. ఇందుకోసం 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నది. యాదాద్రి క్షేత్రంతోపాటు కాటేజీలు, వీవీఐపీ గెస్ట్హౌస్లు, క్యూలైన్లు, వ్రతాల సత్రం, పుష్కరిణి, కల్యాణకట్ట, ప్రసాదాల తయారీ కేంద్రాలు, దుకాణా లు, ఇతర కార్యాలయాలు, బస్టాండ్, ఆటోస్టాండ్, నాలుగు లేన్ల రహదారి, నడకదారి సహా అడుగడుగునా సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా పోలీసులు, విజిలెన్స్ అధికారులు క్షణాల్లో వాలిపోయేలా రూట్ ను తయారు చేశారు. తిరుపతి తరహాలోనే వాహనా లు, లగేజీ తనిఖీ కోసం స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థను సమకూర్చుకోనున్నట్టు అధికారులు తెలిపారు. ఇందుకు అవసరమయ్యే సాంకేతికత కోసం రాచకొండ పోలీసులు తిరుమలలో ప్రత్యేక అధ్యయనం చేశారు. రెండు రోజులపాటు అక్కడ పర్యటించి గత 35 ఏండ్ల నుంచి కొనసాగుతున్న భద్రత, నిఘా వ్యవస్థల పనితీరును పరిశీలించారు.