Komuravelli | చేర్యాల : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో ఆదివారం.. లష్కర్ వారం సందర్భంగా సికింద్రాబాద్ భక్తులతో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన భక్తులు పోటెత్తారు. సుమారు 50 వేల మంది భక్తులు ఇవాళ స్వామివారిని దర్శించుకున్నారు. పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం.. పట్నాలు వేసి ముడుపులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు బోనాలు సమర్పించడంతో పాటు అమ్మవార్లకు ఒడిబియ్యం, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.
లష్కర్ వారం కోసం శనివారం సాయంత్రమే భక్తులు కొమురవెల్లికి చేరుకుని మల్లన్నను ధూళి దర్శనం చేసుకున్నారు. కాగా బ్రహ్మోత్సవాల సందర్భంగా కొమురవెల్లి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఆలయ ఈవో ఏ.బాలాజీ, చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అన్ని వసతులు ఏర్పాటు చేశారు.