హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు 50 శాతం సబ్ కోటా ఇవ్వాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ కాచిగూడలోని హోటల్ అభినందన్ గ్రౌండ్లో మంగళవారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎంపీ వీ హనుమంత రావు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్తో కలిసి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ల బిల్లులోని 33% కోటాలో 50% బీసీ మహిళలకు, అంటే మొత్తం సీట్లలో సుమారు 16.5% సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. సబ్ కోటా అమలు చేయకపోతే అగ్రవర్ణ మహిళలు మాత్రమే లాభపడి, బీసీ మహిళలు మరింత వెనుకబడిపోయే ప్రమాదం ఉన్నదని వాపోయారు. తెలంగాణలో బీసీలు జనాభాలో సుమారు 50-52% ఉన్నా చట్టసభల్లో బీసీ మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉన్నదని, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలైనప్పుడు బీసీ మహిళలకు న్యాయమైన వాటా దక్కాలంటే సబ్ కోటా తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని, జనగణనలో ఎస్సీ, ఎస్టీల కుటుంబాల మాదిరిగానే బీసీ కుటుంబాలను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కుల్కచర్ల శ్రీనివాస్, కురుమ శ్యామ్, విక్రమ్ గౌడ్, మహేశ్ యాదవ్, గణేశాచారి పాల్గొన్నారు.