కాచిగూడ, డిసెంబర్ 20: బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. ఈ వైఖరిని మార్చుకోకపోతే లక్షల మంది బీసీలతో జాతీయస్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం కాచిగూడలో జరిగిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలంటే బిచ్చగాళ్లు కాదని, వాటాదారులని స్పష్టం చేశారు. దేశంలోని 70 కోట్ల మంది బీసీలకు ప్రధాని నరేంద్రమోదీ వ్యతిరేకమా అని ప్రశ్నించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మోదీయే బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జనగణనలో భాగంగా కులగణన చేయాలన్న డిమాండ్ను పునరుద్ఘాటించారు. కులగణన చాలా చిన్న అంశమని గుర్తుచేస్తూ.. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా కులగణన సాధిస్తామని పేర్కొన్నారు. దేశంలోని బీసీలంతా ఏకమై హక్కులను సాధించుకొనే వరకు మోదీ ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ శాఖలు, సంస్థలను ప్రైవేటీకరిస్తే సహించేది లేదని కేంద్రాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత రాజారాంయాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, బీసీ సంఘాల నాయకులు జబ్బల శ్రీనివాస్, మల్లేశ్యాదవ్, నర్సింహగౌడ్, అంజి, కృష్ణయాదవ్, సతీశ్, చంటి, వెంకట్, రవికుమార్, జయంతి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.