హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా జూన్ 6న యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్లోని ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో మంత్రి కేటీఆర్ 50 పరిశ్రమలను ప్రారంభించనున్నారు. వాటితోపాటు రూ.40 కోట్లతో నిర్మించిన కామన్ ఫెసిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించనున్నారు. అక్కడే 100 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న టాయ్స్ పార్క్కు శంకుస్థాపన చేస్తారు. దీనికోసం పరిశ్రమల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రం ఏర్పాటైన అనంతరం చిన్న పరిశ్రమల కోసం ప్రభుత్వం దండు మల్కాపూర్లోని 542 ఎకరాల్లో మూడు దశల్లో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసింది. ఇందులో 400 పరిశ్రమల ఏర్పాటునకు స్థలాలు కేటాయించగా, అందులో ప్రస్తుతం 50 పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 50 పరిశ్రమలు వచ్చే కొద్ది రోజుల్లోనే పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. మిగిలిన పరిశ్రమల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నది. 2025 చివరినాటికి మొత్తం పరిశ్రమలు అందుబాటులోకి వస్తాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి.
ఎర్త్ డ్రిల్లింగ్ ఎక్యిప్మెంట్, మైనింగ్, రక్షణ పరికరాల తయారీ, సోడా మిషన్ మేకింగ్, ఫుడ్ ప్రాసెసింగ్కు సంబంధించి చాక్లెట్లు, బిస్కెట్లు, పచ్చళ్లు, కుర్కురే తదితర పదార్థాల తయారీ, ప్లాస్టిక్ కుర్చీలు, బిల్డింగ్ మెటీరియల్స్, ప్యాకేజింగ్ బ్యాగ్స్, టెక్ట్స్బుక్స్ ప్రింటింగ్, మిల్క్ క్యాన్ల తయారీ, కేబుల్స్ తయారీ, పేవ్మెంట్ టైల్స్, పేవ్మెంట్ టైల్స్ మౌల్డింగ్స్ తయారీ, ప్యాకింగ్ ప్రింటింగ్, కూలర్ల బాడీ తయారీ, పెట్రోల్ బంకుల నిర్మాణ పరిశ్రమ, ప్లాస్టిక్ బకెట్లు, ఆటోమేటిక్ రైస్ గ్రేడింగ్, ప్లాస్టిక్ ప్యాకింగ్ మెటీరియల్, ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్.