అబిడ్స్, జూలై 12: రాష్ట్రంలోని మైనార్టీలు స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలి విడతగా రూ.50 కోట్లు విడుదల చేసినట్టు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ చెప్పారు. నాంపల్లి హజ్హౌస్లోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు క్యాటగిరీల్లో నిరుద్యోగ మైనార్టీలకు రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. 80 శాతం సబ్సిడీతో రూ.లక్ష రుణం, 70 శాతం సబ్సిడీతో రూ.2 లక్షల రుణం ఇస్తామని తెలిపారు. మిగిలిన 20, 30 శాతాలకు బ్యాంకు లింకేజీ ద్వారా మంజూరు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 3,500 మందికి లక్ష రుణాలు, 1,500 మందికి 2 లక్షల రుణాలు మంజూరు చేసేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నట్టు వివరించారు. రూ.50 కోట్లు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్, మైనార్టీశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, శాఖ ఎండీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.