హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఒక్కో వైన్షాపునకు సగటున 50 మంది చొప్పున పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను సొంతం చేసుకునేందుకు ఈ ఏడాది ఆశావహులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. తుది రోజుల్లో అప్లికేషన్లు వెల్లువలా వచ్చిపడ్డాయి. మద్యం షాపులకు లైసెన్సులు జారీ చేసేందుకు ఈ నెల 4 నుంచి 18 వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. చివరి రోజైన శుక్రవారం ఒక్కరోజే 56,980 దరఖాస్తులొచ్చా యి. అంటే, మొత్తం దరఖాస్తుల్లో 43 శా తం ఒక్కరోజే వచ్చాయన్నమాట. అంతకు ఒక రోజు ముందు గురువారం 30,469 దరఖాస్తులు రాగా.. కేవలం ఈ రెండు రోజుల్లోనే 87 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. దుకాణాల కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. పలు జిల్లాల్లో అర్ధరాత్రి వరకూ దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన మొత్తం దరఖాస్తుల లెక్కను శనివారం తేల్చా రు. మొత్తంగా 1,31,490 దరఖాస్తులు వచ్చినట్టు ప్రకటించారు. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. 2021లో వైన్షాపుల కోసం 68,691 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది అదనంగా 62 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాల వారీగా చూస్తే… అత్యధికంగా సరూర్నగర్లో 10,908, శంషాబాద్ లో 10,811 దరఖాస్తులు రాగా, అతి తక్కువగా కుమ్రంభీం ఆసిఫాబాద్లో 967, ఆ తర్వాత ఆదిలాబాద్లో 979మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించారు. ఈ నెల 21న లాటరీ పద్ధతిలో మద్యంషాపులను కేటాయించనున్నారు.