కీసర, జూన్ 20: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం గోధుమకుంట సర్పంచ్ ఆకిటి మహేందర్రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సర్కార్ బడిలో చేరే విద్యార్థులకు రూ.5 వేల నజరానాతోపాటు ఉచితంగా నోటు పుస్తకాలు, షూస్ ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు.
గ్రామంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఉన్నది. ఇందులో 42 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సంవత్సరం కొత్తగా ఐదుగురు విద్యార్థులు చేరారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నర్మద తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించేలా ప్రోత్సహించేందుకు తాము కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు సర్పంచ్ మహేందర్రెడ్డి, ఉప సర్పంచ్ సోమని ఆంజనేయులు తెలిపారు.ఈ సంవత్సరం పాఠశాలలో చేరిన ఐదుగురు విద్యార్థులకు నజరానా ఇచ్చినట్టు చెప్పారు.