అయిజ, అక్టోబర్ 10: కూలీనాలీ చేసుకుంటూ ఐదుగురు పిల్లలతో జీవనం సాగిస్తున్న ఓ నిరుపేద కుటుంబా న్ని భారీ వర్షం ఛిన్నాభిన్నం చేసింది. ఆ కుటుంబమంతా గాఢ నిద్రలో ఉండగా అకస్మాత్తుగా గోడ కూలడంతో భార్యాభర్తలతోపాటు ముగ్గురు పిల్లలు సజీవ సమాధి అయ్యారు. గాయపడ్డ మరో ఇద్దరు చిన్నారులు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కొత్తపల్లిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. వివరాలు ఇలా..
కొత్తపల్లి గ్రామానికి చెందిన మోష, శాంతమ్మ దంపతులకు చరణ్, తేజ, రాము, స్నేహ, చిన్న ఐదుగురు సంతా నం. ఈ దంపతులు ఇటుక బట్టీలో కూలీ పనులు చేస్తూ తమ పిల్లలను పోషించుకుంటున్నారు. శనివారం రాత్రి భోజనం చేసిన వీరు నిద్రకు ఉపక్రమించారు. ఆదివారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పూరి గుడిసెలోని గోడ కూలింది. ఉదయం 6 దాటినా గుడిసెలో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు తలుపు తెరిచి చూడగా.. కూలిన గోడ శిథిలాల కింద మోష(35), శాంత మ్మ (33)తోపాటు చరణ్ (12), తేజ (9) రాము (8) మృతదేహాలు కన్పించాయి. మరో ఇద్దరు చిన్నారులు స్నేహ, చిన్నాలను గుర్తించిన గ్రామస్థులు శిథిలాల నుంచి రక్షించి 108 వాహనంలో గద్వాల దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నారు. డీఎస్పీ రంగస్వామి, సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి ..
కొత్తపల్లి గ్రామంలో గోడ కూలి ఐదుగురు సజీవ సమాధి కావడంతో సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. మృతులు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మంత్రిని ఆదేశించారు. దుర్ఘటనకు సంబంధించి మంత్రి నిరంజన్రెడ్డితో వివరాలు సేకరించారు. మృతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కుటుంబంలో మిగతా వారికి విద్య, వైద్యపరంగా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను అధికారులు గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు మంత్రి పేర్కొన్నారు.