ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 26: ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి పూర్వ విద్యార్థి భారీ విరాళం ప్రకటించారు. ప్రతిపాదిత క్లాస్ రూం కాంప్లెక్స్ ‘వై నరసింహన్ బిల్డింగ్’ నిర్మాణానికి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చి గోపాల్ టీకే కృష్ణ తన ఉదారతను చాటుకొన్నారు. 106 ఏండ్ల ఓయూ చరిత్రలో వ్యక్తిగతంగా అత్యధిక విరాళం అందజేసిన ఘనతను ఆయన సొంతం చేసుకొన్నారు.
ఈ సందర్భంగా గోపాల్ టీకే కృష్ణ దంపతులను ఇంజినీరింగ్ కళాశాల అధికారులు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో 1968లో ఆయన బీఈ పూర్తి చేశారు. స్వలాభాపేక్ష లేకుండా తన విరాళంతో నిర్మిస్తున్న భవనాలకు తనకు విద్యను నేర్పిన అధ్యాపకుల పేర్లు పెట్టడం విశేషం. ప్రొఫెసర్ వీఎం గాడ్గిల్ ఆడిటోరియం, ప్రొఫెసర్ ఆబిద్ అలీ కమిటీ రూం లతో పాటు ల్యాబ్లకు అక్కడి ల్యాబ్ సిబ్బంది పేర్లు పెట్టాలని వర్సిటీకి ప్రతిపాదించారు.