హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): దేశంలో విద్యావిధానం అధ్వాన్నంగా ఉన్నదని నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎస్ఏఎస్)లో తేలింది. దేశంలో 48 శాతం మంది విద్యార్థులు నడుచుకుంటూనే బడికి వెళుతున్నారని 9 శాతం మంది మాత్రమే పాఠశాల రవాణాను ఉపయోగిస్తున్నారని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్వే నివేదిక ఎన్ఏఎస్-2021ని విడుదలచేసింది. ప్రతి మూడేండ్లకోసారి ఈ సర్వే జరుగాల్సి ఉండగా, కరోనా కారణంగా కాస్త ఆలస్యమైంది. ఈ సర్వే నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా విద్యార్థులు 48 శాతం మంది నడుచుకుంటూ బడికి పోతుండగా, 18 శాతం మంది సైకిళ్ల మీద వెళుతున్నారు.
8 శాతం మంది విద్యార్థులు స్కూల్కు వెళ్లేందుకు ద్విచక్రవాహనాలను ఉపయోగిస్తున్నారు. 3 శాతం మంది మాత్రమే సొంత నాలుగు చక్రాల వాహనాలను ఉపయోగిస్తున్నారు. 87 శాతం పాఠశాలలు పిల్లల చదువులో తల్లిదండ్రులను భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నాయి. 25 శాతం మంది విద్యార్థులకు చదువులో తల్లిదండ్రుల ప్రోత్సాహం లభించడం లేదు. 51 శాతం మంది విద్యార్థులకు మాత్రమే పుస్తకాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటున్నాయి. మరో 49 శాతం మంది చాలీచాలని పుస్తకాలతోనే చదువు వెళ్లదీస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 3, 5, 8, 10వ తరగతి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే నిర్వహించింది.
దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ఏఎస్ సర్వే నిర్వహించింది. 720 జిల్లాల్లోని 1.18 లక్షల పాఠశాలల్లో చదువుతున్న 34 లక్షల మంది విద్యార్థుల ప్రతిభా పాటవాలను ఈ సర్వే ద్వారా అంచనా వేసింది. కొవిడ్ కారణంగా పిల్లల చదువులకు ఎదురైన ఇబ్బందులు, కొత్తగా నేర్చుకున్న అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఒకేరోజులో ఒకే సమయంలో సర్వే నిర్వహించింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) రూపొందించిన, అభివృద్ధి చేసిన టెక్నాలజీని ఈ సర్వేకు ఉపయోగించారు.