ములుగు, జూలై 5 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గిరిజన విద్యార్థులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఈనెల 7, 8వ తేదీల్లో 48 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు మహబూబాబాద్ మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ ప్రకటించారు. ప్రధాని మోదీ వరంగల్ పర్యటన సందర్భంగా ఈ దీక్షకు పూనుకున్నట్టు తెలిపారు. బుధవారం ఆయన ము లుగు జిల్లాకేంద్రంలో మీడియాతో మాట్లాడారు. మేడారం మహా జాతరకు జాతీయ హోదా కల్పించడం, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు డిమాండ్లతో స్థానిక గాంధీపార్క్ వద్ద 48 గంటల నిరాహార దీక్ష చేస్తున్నట్టు చెప్పారు. యూనివర్సిటీ ఏర్పాటుచేసే వరకు కేంద్రంపై పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. చట్టసభల్లో ఆమోదం పొందినా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కాకపోవడం తెలంగాణపై బీజేపీ ఎంపీల చిన్నచూపునకు నిదర్శనమని అన్నారు. యూనివర్సిటీ ఏర్పాటుకు స్థల సేకరణ జరగలేదని, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి అబద్ధాలు మాట్లాడటం శోచనీయమన్నారు. గట్టమ్మ దేవాల యం ఎదుట 336 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారని తెలిపారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు 8లోగా సానుకూల ప్రకటన వెలువరించాలని డిమాండ్ చేశారు.