హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 47 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు ప్రకటించింది. మూడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థలనూ ఉత్తమ అవార్డులకు ఎంపిక చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో అవార్డులను ప్రదానం చేస్తారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు హాజరవుతారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి ఉత్తమ పంచాయతీల సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులు, జిల్లా పంచాయతీ అధికారులను ఆహ్వానించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన గ్రామాల సర్పంచులను ఆహ్వానించారు. రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అవార్డుల పంపిణీ కార్యక్రమం పూర్తయింది.
ఈ ఏడాది ఉత్తమ పంచాయతీల ఎంపిక విధానాన్ని కేంద్రం ప్రభుత్వం మార్చింది. తొమ్మిది క్యాటగిరీల్లో అవార్డులు ఇవ్వాలని, దీనిలో ప్రతి గ్రామం పాల్గొనే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. తొమ్మిది విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్న పంచాయతీలను కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేశారు. ప్రతి దశలోనూ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేసి, సమగ్ర పరిశీలన జరిపి అవార్డులకు ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమమైన వాటిని జాతీయ అవార్డుల పోటీకి పంపింది. వచ్చే నెల 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాలకు జాతీయ అవార్డులు ఇవ్వనుంది. ఈ అవార్డుల జాబితాను ఏప్రిల్ రెండోవారం తర్వాత ప్రకటించే అవకాశమున్నది.