నల్లగొండ : నల్గొండ జిల్లా చండూర్ మండలం కస్తాల గ్రామంలో గణపతి నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. గ్రామంలో ప్రతిష్టించిన వినాయకుని నిమజ్జన శోభాయాత్ర గ్రామస్థులంతా కలిసి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులు కలిసి గ్రామ చెరువులో వినాయకుని నిమజ్జనం చేయబోయారు.
వినాయకుడిని నీళ్ళల్లోకి వదులుతుండగా గ్రామానికి చెందిన గోపిడి రాంరెడ్డి (45) ప్రమాదవశాత్తు వినాయకునితో పాటు నీటిలో పడిపోయాడు. అందరూ చూస్తుండగానే నీట మునిగిన రాంరెడ్డి ఊపిరి ఆడక మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.